నేడు-రేపు
పెయ్యేటి భువనేశ్వరి & శైలజ*
(బొమ్మరిల్లులో ప్రచురితం)
రాము,సోము స్నేహితులు. రాము ఎంత డబ్బునైనా క్షణాల్లో ఖర్చు చేసేస్తాడు. రేపు గురించి ఆలోచించడు. సోము పొదుపుగా వాడుకుంటూ తనకు క్కువైన డబ్బును బ్యాంకులో దాచుకునేవాడు.
రాము ఆకలి లేకపోయినా చిరుతిళ్లు తింటాడు. చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూస్తాడు. సోము బయట ఏమీ కొనుక్కు తినడు. బాగున్న సినిమాలని ఒక్కసారి మాత్రమే చూస్తాడు.
ఇద్దరూ స్నేహితులు కావడం వల్ల ఒకరి అలవాట్లొకరికి ఇబ్బంది కలిగిస్తూండేవి.రాము సోముని తన పంథాలోకి మార్చాలనీ,సోము రాముని తన దారికి మళ్లించాలనీ అనుకునేవారు. వారిద్దరి మధ్యా ఈ విషయమై తరచుగా వాగ్వివాదాలు జరిగేవి. ఒకోసారి అలా గంటల తరబడి వాదించుకునేవారిద్దరూ.
రాము సోము తో ఒక రోజున , "నువ్వెప్పుడూ రేపటి గురించే ఆలోచించడంవల్ల నేడు సుఖపడ లేవు. రేపన్నది మనది కాదు. ఆ రోజుకు మనముంటామో ,ఛస్తామో తెలియదు" అన్నాడు.
"అవును రేపన్నది మనది కాదు. ఆ రోజుకు మననే అవసరం వెతుక్కుంటూ వస్తుందో తెలియదు.
అందుకే ప్రాతి ఒక్కరూ రేపు గురించి ఆలోచించాలి. డబ్బు దాచుకోవడం మరీ ముఖ్యం. రేపు ఏ అవసరం వచ్చినా ఎవరినీ యాచించనక్కర్లేదు" అన్నాడు సోము.
"డబ్బుని ఎప్పుడూ ప్ట్టెలో బంధించ కూడదు. లక్ష్మి చంచల మైనది. స్వేచ్ఛను కోరుకుంటుంది. నా డబ్బు నిత్యం చలామణిలో ఉండి నలుగురికీ ఉపయోగ పడుతోంది. నీ డబ్బు చలామణిలో లేక ఎవరికీ ఉపయోగ పడటం లేదు. అసలు ఖర్చు చెయ్యడం కోసమే కదా మనిషి డబ్బుని సృష్టించాడు?" అన్నాడు రాము.
"నువ్వు పొరబాటు పడుతున్నావు. మనిషి డబ్బుని ఖర్చు చేయమని సృష్టించ లేదు. పళ్లు, కాయ గూరలు, తిండి గింజలు అన్నీ కూడా నిలవుండేవి కాదు. అందుకని నిలవుండే డబ్బుని సృష్టించాడు మనిషి. ఆ తర్వాత బ్యాంకులో డబ్బు దాచుకుంటే చలామణిలో ఉండదనుకుంటున్నావా? బ్యాంకు వాళ్లు అవసరంలో ఉన్న వారికి వడ్డీకి అప్పులిస్తారు. దాచుకున్నందుకు మనకూ వడ్డీ ఇస్తారు. మనకంటే త్లివిగా డబ్బు ఖర్చుచేసే వారి వద్ద
డబ్బు దాచుకోవడం మెరుగైన పద్ధతి కదా!" అన్నాడు సోము.
"సరే. డబ్బు దాచుకుంటావు. అప్పుడే భూకంపమో గాలి వానో వచ్చి చచ్చి పోయావనుకో. ఏమిటి
లాభం?" అన్నాడు రాము.
"భూకంపం గాలి వానలకు చచ్చి పోకుండా బ్రతికావనుకో, అప్పుడు లాభమే కదా! అయినా నీకూ
నాకూ తేడా చూశావా? డబ్బు దాచుకోక పోవడం వల్ల నువ్వెప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నావు. డబ్బు దాచుకోవడం వల్ల నేనెప్పుడూ బ్రతుకు గురించే ఆలోచిస్తున్నాను. రేపు సుఖ పడతానని నాకున్న నమ్మకం నీకు లేదు" అన్నాడు సోము.
ఇలా వాళ్లిద్దరూ వాదించుకుంటూ ఊరి బయటకు వచ్చారు. అక్కడొక రైతు ఆవునొకదాన్ని కొడుతూ నానా దుర్భాషలూ ఆడుతున్నాడు. రాము,సోములు ఏం జరిగిందని అడిగారు.
"నేను రోజూ దీనికి కడుపు నిండా తిండి పెడుతున్నాను. ఈ వేళ ఏం మాయ రోగం వచ్చిందో
దీనికి -కట్లు తెంచుకుని ఎవరెవరి పొలాల్లోనో చొరబడి మేసినంత మ్మేస్తూ పొలాలు తొక్కి పాడు చేస్తోంది. ఇలా చేస్తే రేపటికి దీనికి తిండి దొరకదు. మనకూ తిండి ఉండదు. ఆ మాత్రం తెలియకపోతే ఎలా అని కొడుతున్నాను" అన్నాడు రైతు కోపంగా.
"పాపం, నోరు లేనీ జంతువు. రేపటి గురించి దానికేమి తెలుస్తుంది? స్వేచ్ఛకోసం కట్లు తెంచుకుంది. కనబడిన పొలాల్లో చొరబడి తిన్నంత తిని తిరుగుతోంది. దాన్ని కొడితే ఏం లాభం? నువ్వే ఆవును జాగ్రత్తగా కట్టాలి" అన్నాడు రామూ జాలిగా ఆవును చూస్తూ.
వెంటనే సోము తల అడ్డంగా ఊపి , పశువు కూడా రేపటి గురించి ఆలోచిస్తుంది. అదే ఆవుని అడవిలో వదిలి పెట్టు. అప్పుడది రోజూ ఒకే చోట మేత మెయ్యదు. ఒక రోజు ఒకచోట ఇంకో రోజు ఇంకోచోట అలా మారుతూ వుంటుంది. అందువల్ల మేత మేసిన చోట్ల మళ్లీ గడ్డి పెరిగే అవకాశముంటుంది. ఇక్కడ ఆవుకి యజమాని ఉండి అన్నీ సమకూర్చుతున్నాడు. ఆవు నిశ్చింతగా వుండి రేపటి గురించి ఆలోచించడం మానేసింది. ఎదుటి వాళ్ల మీద ఆధార పడ్డ వాళ్లు రేపు గురించి ఆలోచించరు. అర్థమైందా?" అన్నాడు సోము.
దీనికి రాము ఒప్పుకోక, "జంతువులకు రేపు గురించి తెలియదు. అందుకే అవి హాయిగా ఉంటున్నాయి." అన్నాడు.
"నిజమే! హాయిగా ఉండడానికి రేపు గురించి ఆలోచించక పోవడం జంతువుల లక్షణం" అన్నాడు సోము.
రాముకి ఉక్రోషం వచ్చింది. చాలా తెలివిగా సోము తనని పశువని తిట్టాడు. ఏమనాలో తెలియక,"నేర్చుకునే మంచి లక్షణాలెక్కడున్నా తెలుసుకోవడం ఉత్తమ పురుష లక్షణం. అందుకే నేను జంతువులనుంచి రేపు అనే రోజు గురించి ఆలోచించ కూడదని తెలూకున్నాను" అన్నాడు.
సోము ఏ మాత్రం తడుముకోకుండా, "అవును. నేను కూడా జంతువుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. రేపు గురించి ఆలోచించాలని కూడా జంతువుల వల్లే తెలిసింది నాకు. జంతువులే కాదు. పక్షులూ,క్రిమి కీటకాలూ కూడా మనకిదే నీతిని చెబుతాయి. రేపు వర్షం వస్తుందేమోనని ఈ రోజే పక్షులు గూడు కట్టు కుంటాయి. పిల్లులు పిల్లల్ని పెట్టే ముందు గుడ్డ పీలికలు పోగు చేసి మెత్తటి పక్కనుఏర్పాటు చేసుకుంటాయి. తేనె టీగలు తేనెను పోగుచేసుకుంటాయి. చీమలు ఆహారాన్ని సేకరించి దాచుకుంటాయి" అన్నాడు.
"నేనేదంటే అదే కాదంటావు. ఒక సారి నన్ను జంతువుతో సమానమంటావు. ఇంకోసారి జంతువులనుంచి నేర్చుకోవలంటావు. నీదంతా వితండ వాదనలాఉంది" అన్నాడు రాము ఉక్రోషం ఆపుకోలేక.
అప్పుడు రైతు కలగ చేసుకుని, "సోముది వితండ వాదమైతే నీదీ వితండవాదమే! నిజం తెలుసుకుందుకే మనం వాదించుకోవాలి తప్ప అన్న మాటే నెగ్గించుకోవాలంటే ఉన్న మాట తెలియదు. సోము అన్నీ చక్కగా చెప్పాడు. నువ్వు అన్నీ సోము దగ్గరే నేర్చుకో. సోమూ మాటల వల్ల నీకే కాదు,నాకూ ఈ ప్రపంచానికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది" అని రాముకి హిత బోధ చేసాడు.
"నువ్వూ నేనూ రేపటి గురించి ఆలోచిస్తే అందువల్ల మనకి లాభముంటుందేమో కానీ ప్రపంచానికేం మేలు జరుగుతుంది?" అన్నాడు రాము ఆశ్చర్యంగా.
"మాంసం కోసం మనం పక్షుల్నీ జంతువుల్నీ చంపుతాం. ఆ జాతులు నశించి పోయేలా వాటిని చంపేయ కూడదు. అలాగే ఆత్మ రక్షణ కోసం కౄర మౄగాలనూ,విష కీటకాల్నూ కూడా నాశనం చేయ కూడదు. ప్రపంచానికి వాటివల్ల ప్రయోజన్ముంది. నివాసం కోసం అడవులను నరికి ఇళ్లు కట్టుకున్నం. వౄక్ష జాతి నాశనమైతే , భూమ్మీద వానలు పడవు.విష వాయువులు పీల్చ బడవు. నదీ జలాలను పరిశుభ్రంగా ఉంచకుండా కలుషితం చేస్తే ఏదో ఒక రోజున అవి విష జలాలై మనకు తాగడానికి నీరుండదు. మనమంతా రేపు గురించి ఆలోచించి మన సంపదతో పాటు.ప్రకౄతి సంపదను పొదుపుగా వాడుకుంటే ముందు తరాలకు జరిగే కీడు ఆగి పోతుంది. ఈ విషయాలన్నీ సోము మాటలు విన్నాక్ నాకు తట్టాయి." అన్నాడు రైతు.
అప్పటికి రాముకి కూడా రేపు గొప్పతనం అర్థమై ,"రేపంట్ ఎప్పుడో వచ్చేది కాదు. ఏదో ఒకరోజున ప్రతి రేపూ నేడు అవుతుంది. అందుకే రేపు గురించి ఆలోచించకుండా మనిషి సుఖ పడ లేడు " అని ఒప్పుకున్నాడు. మిత్రుడిలో వచ్చిన మంచి మార్పుకు సోము సంతోషించాడు.*